Breaking News

దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే జాతీయ విద్యా విధానం - About National Educational Policy in Telugu

 


అనేక సంవత్సరాల నుండి ఈ దేశం ఎదుర్కొంటున్న  వివిధ సమస్యలకు పరిష్కారం చూపడానికి వీలుగా భారత ప్రభుత్వం జాతీయ విద్యా విధానం 2020 తీసుకొచ్చింది.  మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత 1968లో మొదటి విద్యా విధానం, 1986లో నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చారు.  అయితే దానిలో 1992లో కొన్ని మార్పులు, చేర్పులు చేసి నేటి వరకు కొనసాగిస్తున్నారు.  ప్రొఫెసర్‌ ‌యశ్‌పాల్‌ ‌కమిటీ  ఇచ్చిన నివేదికలో పొందుపరచిన భారరహిత విద్య ఆధారంగా నేషనల్‌ ‌కరిక్యులం ఫ్రేమ్‌ ‌వర్క్ 2005 ‌తయారు చేసి దాని ఆధారంగా తయారైన   పుస్తకాలను ప్రస్తుతం పాఠశాలలో బోధిస్తున్నారు.  అయితే ప్రస్తుత పుస్తకాల్లో  భారతీయత లోపించిందని యూరోప్‌,  ‌పశ్చిమదేశాల ఆధారంగా ఈ దేశంలో విద్యా విధానం ఇంకా కొనసాగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

 

2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎస్సార్‌ ‌సుబ్రమణ్యం కమిటీని నియమించింది.  2019 మే లో కస్తూరి రంగన్‌ ‌కమిటీ నియమించింది.  ఈ కమిటీ విస్తృతమైన అధ్యయనం చేసి,  అనేకమంది విద్యావేత్తలతో సంప్రదింపులు జరిపిన తర్వాత  తమ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది.  ఈ తుది నివేదిక తయారు చేయడానికి రెండు లక్షలకు పైగా సలహాలు భారతదేశంలోని వివిధ మేధావుల నుండి స్వీకరించింది.  ఆ  డ్రాఫ్ట్‌ను  కేంద్ర క్యాబినెట్‌ ‌జూలై 29 న ఆమోదించింది.  ఈ జాతీయ విద్యా విధానం దేశంలోని విద్యార్థులను జ్ఞానవంతులుగా, నైపుణ్యం, అవగాహన కలిగిన వ్యక్తులుగా  తీర్చిదిద్దాలని భావించింది.  దీని కోసం కావలసిన నాణ్యమైన విద్యను అందరికీ అందించాలని  ప్రణాళిక విజన్‌లో తెలియజేశారు.

 

కొత్తగా ప్రతిపాదించిన విధానంలో అనేక నూతన అంశాలను చేర్చారు. వాటిలో ముఖ్యమైన నిర్మాణాత్మకమైన మార్పులు:

 ప్రస్తుతం ఉన్న టెన్‌ ‌ప్లస్‌ ‌టు విధానం స్థానంలో 5+3+3+4 అనే కొత్త విధానం తెచ్చారు.  నేడున్న  ఇంటర్మీడియట్‌ ‌కళాశాలలు రాబోయే కాలంలో ఉండవు.  వీటిని పాఠశాల విద్యలో  కలిపేస్తారు.  ఇప్పటి వరకు ఐదేళ్లు దాటిన విద్యార్థులకు మాత్రమే ఒకటవ తరగతిలో ప్రవేశం కల్పిస్తున్నారు.  కొత్త విధానంలో మూడేళ్ల పిల్లలకు నర్సరీలో ప్రవేశానికి అనుమతిస్తారు.  తొమ్మిది నుండి 12వ తరగతి విద్యార్థులకు సెమిస్టర్‌ ‌విధానం వర్తిస్తుంది.  డిగ్రీ విద్యార్థులు నాలుగేళ్లు చదవాలి.  అయితే ఇందులో ఎప్పుడైనా చేరడానికి ఎప్పుడైనా మానేయడానికి అనుమతి లభిస్తుంది.   మొదటి ఏడాది  తర్వాత  సర్టిఫికెట్‌ ‌కోర్సు, రెండో ఏడాదికి• డిప్లొమా, మూడో ఏడాది వారికి బ్యాచులర్స్ ‌డిగ్రీ , నాలుగు సంవత్సరాలు పూర్తి చేసిన వారికి పరిశోధనతో కూడిన డిగ్రీ ప్రదానం చేస్తారు.

 

విద్యార్థులకు విషయాలను ఎంపిక చేసుకునే  స్వేచ్ఛ ఇచ్చారు.  కఠినంగా ఉండే ఒక విషయాన్ని ఎంచుకున్న వాళ్లు  సులభమైన ఇతర విషయాలు  ఎంచుకునే అవకాశమూ ఉంది.  సాంప్రదాయ విషయాలతో బాటు, భారతీయ కళలకు  ప్రాముఖ్యత లభించింది.  కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖను  విద్యాశాఖగా మార్చారు.  వీటన్నింటి కంటే ప్రధానమైంది కేంద్రం ఆధీనంలో ఉన్న  యూజీసీ, ఏఐసీటీ, జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి వంటి సంస్థలన్నింటిని విలీనం చేసి ఒకే వ్యవస్థ పరిధిలోకి తీసుకొని రానున్నారు. భావనలను బట్టీ పట్టడం కాకుండా అవగాహన చేసుకోవడానికి అవకాశం కల్పించారు.  దీనితోపాటు ప్రాథమిక స్థాయి నుండి సైన్సు పట్ల అవగాహనను పెంచుతారు.

 

ఈ నూతన జాతీయ విద్యా విధానంలో విద్యార్థులు ఐదవ తరగతి వరకూ మాతృభాషలోనే చదువుకోవాలి.  అలాగే అవసరాన్ని బట్టి ఎనిమిదవ తరగతి వరకు కొనసాగించే వెలసుబాటు ఇచ్చారు.  ఉన్నత స్థాయిలో వైద్యశాస్త్రం , ఇంజనీరింగ్‌ ‌వంటివి కూడా తెలుగులో అధ్యయనం చేసేందుకు అవకాశం ఇచ్చే విషయం పరిశీలించనున్నారు. అయితే మాతృభాష విషయంలో కొంత సంశయం ఉంది.  దీన్ని తప్పనిసరిగా అమలు చేస్తామని విధాన పత్రంలో లేదు.  మనది సమాఖ్య వ్యవస్థ అయినందువల్ల రాష్ట్రాలకు అమలు చేసే బాధ్యతను అప్పగించి,  సూచనలు చేశారు.  మాతృభాషకు మాత్రమే  కాకుండా స్థానిక భాషలకు పెద్దపీట వేయనున్నారు.  దీని అమలుకు  విధి విధానాలను రూపొందించవలసి ఉంది.  విద్యార్థులు సెకండరీ స్థాయిలో విదేశీ భాషలను నేర్చుకునే వెసులుబాటు కల్పించారు.

 

విద్య పైన కేటాయింపులను స్థూల జాతీయోత్పత్తిలో 6 శాతానికి పెంచారు.  ప్రస్తుతం ఇది  4.5 శాతం మించడం లేదు.  భారతదేశంలో ప్రాథమిక పాఠశాలలు అనేక రకాల మౌలిక వసతుల సమస్యలను ఎదుర్కొంటున్నాయి.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధాన పత్రాల్లో తెలిపినట్లుగా నిధులను నిజంగా కేటాయిస్తే విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు రావడం సాధ్యమే.

 

విద్యార్థులు చదివే పాఠ్యాంశాలు కానీ,  వాళ్లు ఆడే ఆటలు కానీ,  నేర్చుకునే కళలు కానీ భారతీయత  ఆధారంగా రానున్నాయి. ఇక్కడి విద్యార్థులు ఈ దేశ సంస్కృతిని, ఈ దేశ వైభవ స్థితిని గురించి తెలుసుకొని,  దానిపట్ల గర్వపడేలా తయారు చేయాలన్నదే ఈ విధాన పత్రం ముఖ్య  లక్ష్యంగా తెలుస్తోంది. ఈ విషయాలు సరిగ్గా ప్రతిబింబించాలంటే పాఠ్యపుస్తకాల తయారీలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

 

పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థి సమాజంతో, ప్రకృతితో మమేకం కావాలి.  పరిసరాల్లో  ఉండే పర్యావరణంతో పరిచయం చేసుకోవాలి.  స్థానిక మార్కెట్‌లుకానీ,  వ్యవసాయ క్షేత్రాన్నిగానీ సందర్శించేందుకు అవకాశం కల్పించాలి.  పూర్వశిశు (నర్సరీ) విద్యార్థులకు క్రియాకలపాలతో కూడిన విద్యా విధానాన్ని కొనసాగిస్తారు.  వీటిలో స్థానిక కథలు, పాటలు, కథల పద్యాలు, శ్లోకాలు, పజిల్స్ , ‌రిడిల్స్ ‌సంబంధించిన గేమ్స్ ఉం‌డనున్నాయి.  ఇప్పటికీ మన దేశంలో ట్వింకిల్‌ ‌ట్వింకిల్‌ ‌లిటిల్‌ ‌స్టార్‌ ,  ‌రైన్‌ ‌రైన్‌ ‌గో అవే అనేవే నేర్పిస్తూ  ఉన్నాం.  అతి తక్కువ ఖర్చుతో లేదా అసలు ఖర్చులేని బోధనోపకరణాలను వాడటం ద్వారా చిన్న పిల్లల్లో విజ్ఞానాన్ని అభివృద్ధిపరిచే పక్రియ రానుంది.  పూర్వ  ప్రాథమిక తరగతుల్లో పిల్లలకు పై తరగతులకు కావలసిన సామర్థ్యం కల్పించేలా తయారు చేస్తారు.

 

ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఐదేళ్లు దాటిన తర్వాత మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నారు. దీనితో  పేద,  దిగువ తరగతి తల్లితండ్రులు  తమ పిల్లలను పాఠశాలలో మూడేళ్లకు చేర్చలేకపోవడం  ఆ చిన్నారులు చదువులో ముందడుగు వేయలేకపోతున్నారు. ఈ విధానంలో ఆ పిల్లలకు అవకాశం ఇవ్వడం వల్ల వారందరూ ప్రయోజనం పొందనున్నారు.  ప్రైవేటు పాఠశాలల్లో చదివించగల ఆర్థిక స్తోమత ఉన్న  పోషకులు అనేక సంవత్సరాలుగా నర్సరీ తరగతుల్లో వారి పిల్లలను చేర్పిస్తున్నారు. దీనితో సమాజంలో రెండు వర్గాలుగా విడిపోయిన తల్లితండ్రులు తమ పిల్లలచదువు విషయంలో  భేదభావం అనుభవిస్తున్నారు.  ఈ నూతన విద్యా విధానంతో అందరూ ప్రయోజనం పొందనున్నారు.  ముఖ్యంగా ఈ వయసు పిల్లలు దాదాపు 85 శాతం మెదడు అభివృద్ధి చెందే దశలో ఉంటారు. ఆరేళ్ల లోపు చిన్నారులకు అవకాశం ఇవ్వడం నిజంగా ఒక వరం.

 

మన దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో అభ్యసన సంక్షోభం ఒకటి.  అనగా పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారు కానీ, పొందాల్సిన  నైపుణ్యాలు పొందడం లేదు.  దీన్ని నివారించడం కోసం అక్షరాస్యత, సంఖ్యాత్మక జ్ఞానం పునాదిగా కింది తరగతుల్లో  క్రీడా పద్ధతిలో విద్యను బోధించనున్నారు.  దేశవ్యాప్తంగా మానవవనరుల అభివృద్ధి శాఖ ద్వారా ఒక మిషన్‌ ఏర్పాటు చేయనున్నారు.  ఉపాధ్యాయులకు, అంగన్‌వాడి టీచర్లకు శిక్షణ ఇచ్చి దీన్ని  బలోపేతం చేయనున్నారు.  జాతీయ పుస్తక అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు.  అత్యుత్తమ నాణ్యత కలిగిన వనరులనూ, జాతీయ రిపోజిటరీగా దీక్షా పోర్టల్‌లో  అందుబాటులో ఉంచనున్నారు.  పూర్వ ప్రాథమికలో ఎలాంటి పరీక్షలు నిర్వహించరు.  కేవలం మూడు, ఐదు, ఎనిమిదో తరగతిలో మాత్రమే  పరీక్షలు ఉంటాయి.  స్టేట్‌ ‌బోర్డు పరీక్షలు కేవలం పదవ,పన్నెండో తరగతికి మాత్రమే ఉంటాయి.

 

అయాచితుల లక్ష్మణరావు

(విద్యాభారతి దక్షిణమధ్యక్షేత్ర కార్యదర్శి)

 

విశ్వ సంవాద కేంద్రం, తెలంగాణ సౌజన్యంతో..

1 comment:

  1. అనేక సంవత్సరాల నుండి ఈ దేశం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు పరిష్కారం చూపడానికి వీలుగా భారత ప్రభుత్వం జాతీయ విద్యా విధానం 2020 తీసుకొచ్చింది.

    ReplyDelete