Breaking News

జాతీయ కవి - గరిమెళ్ల సత్యనారాయణ

జననం: జూలై 15, 1893-శ్రీకాకుళం
మరణం: డిసెంబర్ 18, 1952

తెల్లదొరతానంపై గర్జించిన గరిమెళ్ళ



ప్రొఫైల్‌

పేరు : గరిమెళ్ల సత్యనారాయణ

జననం : 15 జూలై 1893

జన్మస్థలం : శ్రీకాకుళం జిల్లా గోనెపాడు గ్రామం

స్వస్థలం : ప్రియాగ్రహారం

తల్లిదండ్రులు : సూరమ్మ, వేంకట నరసింహం

ప్రాముఖ్యత : స్వాతంత్య్ర సమరయోధుడు,

కవి, రచయిత

మరణం : 18 డిసెంబర్‌ 1952

నిర్వహించిన వృత్తులు : గంజాం కలెక్టర్‌ కార్యాలయంలో గుమస్తా, విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు, ప్రియాగ్రహారంలో గ్రంథాలయ కార్యదర్శి, ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు, ఆనందవాణికి సంపాదకుడు, ఆచార్య రంగా, వాహిని పత్రికలో సహాయ సంపాదకుడు

‘మాకొద్దీ తెల్ల దొరతనం అంటూ సత్యాగ్రహుల్లో గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించి... ‘దండాలు దండాలు భారత మాత’ అంటూ ప్రజలను ఎంతగానో జాగృతం చేసిన కవి గరిమెళ్ళ సత్యనారాయణ. స్వాతంత్రోద్యమ కవుల్లో విశిష్టమైన స్థానం సంపాదించుకున్న ఈయన గేయాలన్నీ అప్పట్లో జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాలను ఉర్రూతలూగించాయి. దేశభక్తి కవితలు రాసి జైలుశిక్షను అనుభవించిన వారిలో ప్రప్రథముడు గరిమెళ్ళ. నిజాయితీకి, నిర్భీతికి మారుపేరుగా నిలిచిన ఈయన రాసిన ‘మాకొద్దీ తెల్ల దొరతనం’ అనే పాట... ఆనాడు ప్రతి తెలుగువాడి నోటిలోనూ మార్మేగేది. తెలుగునాట జాతీయ కవిత్వానికి ఒరవడిపెట్టిన మేటి కవి గరిమెళ్ళ జన్మదినం నేడే. ఈయనలాగా ప్రసిద్ధి చెందిన జాతీయకవి ఆ రోజుల్లో మరొకరు లేరంటే అతిశయోక్తి కానేరదు.

తొలినాళ్ళలో... గరిమెళ్ళ సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలుక గోనెపాడు గ్రామంలో 14 జూలై 1893 న జన్మించాడు. తల్లి సూరమ్మ, తండ్రి వేంకట నరసింహం. గరిమెళ్ళ ప్రాథమిక విద్య స్వగ్రామమైన ప్రియాగ్రహారంలో సాగింది. విజయనగరం, మచిలీపట్నం, రాజమహేంద్రవరం మొదలైనచోట్ల పైచదువులు చదివాడు. బి.ఏ. చేశాక గంజాం కలెక్టర్‌ కార్యాలయంలో గుమస్తాగా కొంతకాలం పనిచేశాడు. ఆ తరువాత విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా కొంతకాలం పనిచేశాడు. గరిమెళ్ళ చిన్నప్పుడే మేనమామ కూతుర్ని వివాహం చేసుకున్నాడు. అతని స్వేచ్ఛాప్రియత్వం వల్ల ఎక్కువకాలం ఏ ఉద్యోగమూ చెయ్యలేకపోయాడు.

జాతీయోద్యమ స్ఫూర్తి... 1920 డిసెంబర్‌లో కలకత్తాలో జరిగిన కాంగ్రెసు మహాసభలో సహాయనిరాకరణ తీర్మానం అమోదించబడింది. ఆ వీరావేశంతో ఉద్యమంలోకి దూకిన గరిమెళ్ళ ‘మా కొద్దీ తెల్లదొరతనం’ పాటను వ్రాశాడు. ఆనాటి రోజుల్లో రాజమండ్రిలో ఈ పాట నకలు కాపీలు ఒక్కొక్కటి బేడా (12 పైసలు) చొప్పున అమ్ముడు పోయేవట. ఆనోటా- ఈనోటా ఈ పాట గురించి ఆనాటి బ్రిటీషు కలెక్టరు బ్రేకన్‌ చెవినపడి ఆయన గరిమెళ్ళను పిలిపించి పాటను పూర్తిగా పాడమన్నారట. గరిమెళ్ళ కేవలం రచయితే కాదు, గొప్ప గాయకుడు కూడా. తన కంచు కంఠంతో ఖంగున పాటలు కూడా పాడగలడు. గరెమెళ్ళ పాట విన్న బ్రిటీషు కలెక్టరు తెలుగుభాష నాకు రాకపోయినప్పటికీ, ఈ పాటలో ఎంతట మహత్తర శక్తి ఉందో, సామాన్య ప్రజల్ని సైతం ఎలా చైతన్యపర్చగలదో నేను ఊగించగలనన్నాడట. ఆ పాటను వ్రాసినందుకు గరిమెళ్ళకు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించారు. ఆ రోజుల్లో కాంగ్రెసు స్వచ్ఛంద సేవకులు ఖద్దరు దుస్తులు ధరించి, గాంధీటోపీ పెట్టుకుని, బారులు తీరి మువ్వన్నెల జెండా ఎగరవేసుకుంటూ.

‘‘మాకొద్దీ తెల్లదొరతనం - దేవ

మాకొద్దీ తెల్లదొరతనం’’

అంటూ ఆకాశం దద్దరిల్లేలా పాడుతూ వీధుల్లో కవాతు చేసేవారట.

శిక్షపూర్తి చేసు కుని జైలు నుంచి విడుదల అయిన గరిమెళ్ళ మళ్ళీ ప్రజల మధ్య గొంతెత్తి పాడసాగాడు. ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకోసాగాడు. ఇది చూసి ప్రభు త్వాధికారులు భయపడ్డారు. గరిమెళ్ళ బయట వుండటం ప్రభుత్వానికి మంచిది కాదని భావించి ఆయనను అరెస్టు చేశారు. కాకినాడ మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరచారు. మేజిస్ట్రేట్‌ రెండు సంవత్సరములు కఠిన కారాగార శిక్ష విధించాడు. గరిమెళ్ళ జైలులో వుండగా 1923 జనవరిలో ఆయన తండ్రి చనిపోయాడు. క్షమాపణ చెబితే ఒదులుతామని చెప్పారట. కాని గరిమెళ్ళ క్షమాపణ చెప్పకుండా జైలులోనే వున్నాడు. అంతటి దేశ భక్తుడు ఆయన.

జైలు నుంచి విడుదల కాగానే ప్రజలు ఆయనకు ఎన్నోచోట్ల సన్మానాలు చేశారు. ఆయన జీవితంలో మధుర ఘట్టం ఇదొక్కటే. ఆ తరువాత కొద్దిరోజులకు భార్య చనిపోయింది. అప్పుడాయనకి ఇద్దరు కుమార్తెలు. గరిమెళ్ళ మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. అప్పులు పెరగడంతో వున్న ఆస్తి అమ్మేసి అప్పులు తీర్చాడు. ఉద్యోగం వదిలేశాక కొంతకాలం ప్రియాగ్రహారంలో గ్రంథాలయ కార్యదర్శిగా పనిచేశాడు. శ్రీ శారదా గ్రంథమాల స్థాపించి పద్దెనిమిది పుస్త్తకాలు అచ్చువేశాడు. అవి అమ్ముడుపోలేదు. ఆయన ఎక్కువగా రాజమండ్రి, విజయవాడ, మద్రాసులకు తిరుగుతూ వుండడంతో, వాటిని పట్టించుకోకపోవడం వల్ల వాటిని చెదలు తినేశాయి. వాటి వల్ల కూడా కొంత నష్టం వచ్చింది. రచనలు... 1921లో గరిమెళ్ళ ‘స్వరాజ్య గీతములు’ పుస్తకం వెలువడింది. 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యములు, భక్తిగీతాలు, బాలగీతాలు మొదలైన రచనలు వెలువడ్డాయి. గరిమెళ్ళ చాలాసార్లు జైలు శిక్ష అనుభవించాడు. జైలులో వుండగా తమిళ, కన్నడ భాషలు నేర్చుకున్నాడు. తమిళ, కన్నడ గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. ఆంగ్లంలో కూడా గరిమెళ్ళ కొన్ని రచనలు చేశాడు. ఆంగ్లం నుంచి కొన్ని గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. భోగరాజు పట్టాభిసీతారామయ్య ఆంగ్లంలో వ్రాసిన ‘ది ఎకనామిక్‌ కాంక్వెస్ట్‌ ఆఫ్‌ ఇండియా’ అనే గ్రంథాన్ని తెలుగులోకి అనువదించాడు. గరిమెళ్ళ జీవనోపాధి కోసం 1933లో మద్రాసు చేరుకున్నాడు. అక్కడ గృహలక్ష్మి పత్రిక సంపాదకుడుగా ఉద్యోగంలో చేరాడు. కొంతకాలం తరువాత అక్కడ మానివేసి ఆచార్య రంగా, వాహిని పత్రికలో సహాయ సంపాదకుడుగా చేరాడు. కొద్ది రోజులతర్వాత ఆంధ్రప్రభలో చేరాడు. కొంతకాలం ఆనందవాణికి సంపాదకుడుగా పనిచేశాడు. కొంతకాలం ఫ్రీలాన్స్‌ జర్నలిస్టుగా జీవనం సాగించాడు.

చివరిదశ... గరిమెళ్ళ పేదరికం అనుభవిస్తున్న రోజుల్లో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు కొంత సహాయ పడ్డాడు. వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులు ప్రతినెలా ఆయనకు ఆర్థిక సహాయం చేసేవాడు. వివిధ పత్రికలకు, ఆలిండియా రేడియోకి రచనలు చేసి కొంత గడిస్తున్నా ఆయన అవసరాలకు ఆ డబ్బు చాలలేదు. ఒకవైపు పేదరికం, మరోవైపు అనారోగ్యం ఆయనను బాగా దెబ్బతీశాయి. చివరిదశలో ఒక కన్నుపోయింది. పక్షవాతం వచ్చింది. దిక్కులేని పరిస్థితుల్లో కొంతకాలం యాచన మీద బ్రతికాడు. స్వాతంత్య్రానంతరం మన పాలకుల వల్ల కూడా గరిమెళ్ళకు చెప్పుకోదగ్గ సహాయం లభించలేదు. దాంతో కొంతమంది మిత్రులు గరిమెళ్ళను ‘మాకొద్దీ నల్ల దొరతనం’ అనే గేయం వ్రాయలని అడిగారట. దేశ భక్తుడు, స్వాతంత్య్ర పిపాసి అయిన గరిమెళ్ళ అందుకు అంగీకరించలేదుట. చరమ దశలో దుర్భర దారిద్య్రాన్ని అనుభవించిన గరిమెళ్ళ 1952 డిసెంబర్‌ 18వ తేదీన మరణించాడు. ఆయన అంత్యక్రియలు ఇరుగు పొరుగు వారు జరిపారు.

No comments