Breaking News

విశ్వేశ్వరాయ జీవితం నేర్పే పాఠాలు

జననం: సెప్టెంబర్ 15, 1860
మరణం: ఏప్రిల్ 12, 1962

సెప్టెంబర్‌ 15 జాతీయ ఇంజనీర్స్‌డే. ఇంజనీర్‌గా, పాలనాదక్షునిగా, రాజనీతిజ్ఞునిగా, నిష్కామ దేశభక్తునిగా అఖండ కీర్తిని ఆర్జించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టిన రోజు.

భారతదేశంలో ఎంతోమంది మేధావులు జన్మించి వివిధ రంగాలకు ఎనలేని సేవలందించారు. అటువంటివారిలో ‘భారతరత్న’ విశ్వేశ్వరయ్య ఒకరు. నవ భారత నిర్మాణానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం.1908లో మూసీ నదికి వరద రావడంతో హైదరాబాద్‌ నగరం తల్లడిల్లింది. వరదల నుండి రక్షణ కోసం అప్పటి నిజాం నవాబు విశ్వేశ్వరయ్యను ఆహ్వానించి ఒక పథకం రూపొందించాలని కోరారు. నగర మురుగునీటి పారుదల పథకాన్ని కూడా తయారుచేయమని కోరారు. 1909 ఏప్రిల్‌ నుండి అక్టోబర్‌ వరకు విశ్వేశ్వరయ్య ఈ పని మీదనే శ్రమించారు. 250 కోట్ల రూపాయలతో పథకాలను సిద్ధం చేశారు. ఈ పనులు వెంటనే అమలు పరచలేదు. హైద్రాబాద్‌లోని బ్రిటీష్‌ ఇంజనీర్లు ఆ పనుల అమలుకు విముఖంగా ఉండడం వల్ల జాప్యం జరిగింది. ఆ తర్వాత ఆయన పథకాలనే అమలుపరిచారు. దాని పర్యవసానమే మూసీ, ఈసీ నదులపై రిజర్వాయర్లను నిర్మించారు. వీటి నిర్మాణంతో హైదరాబాద్‌ నగరానికి వరద ప్రమాదం తప్పిపోయింది. ఈ పథకాలను ఆ తరువాత బ్రిటీష్‌ ఇంజనీర్లు కూడా కొనియాడారు.

1922 సంవత్సరంలో విశ్వేశ్వరయ్య నిజాం ప్రభుత్వ ఆహ్వానం మేరకు హైదరాబాద్‌ సందర్శించి సమగ్ర అభివృద్ధికి ఒక పథకాన్ని రూపొందించారు. అప్పట్లో హైద్రాబాద్‌లోని ప్రఖ్యాత ఇంజనీర్‌ బహుదూర్‌ సాగర్‌ నిర్మించారు. ఈ రెండు రిజర్వాయర్లు హైదరాబాద్‌ నగరవాసులకు మంచినీటిని అందిస్తున్నాయి.విశ్వేశ్వరయ్య ఎంతో క్రమశిక్షణ కలిగినవారు. ఆయనకు ఒకటే ఆశయం, ప్రజలు ఆలోచనపరులు కావాలి, మారుతున్న సమాజాన్ని అధ్యయనం చేస్తుండాలి. సాంకేతిక మార్పులను అవగాహన చేసుకుంటుండాలి. అభివృద్ధి చెందిన దేశాల అనుభవాలను అధ్యయనం చేయాలి. ఏ పనిచేసినా చిత్తశుద్ధి ఉంటే ఆ పనికి అందరికీ ఆదర్శమవుతుంది.

విదేశీ వస్తువులను కొనుగోలు చేయడాన్ని విశ్వేశ్వరయ్య వ్యతిరేకించారు. వాటిని కొనుగోలు చేస్తే మన కార్మికుల పొట్టకొట్టినట్లవుతుందని బొంబాయిలో ఇండియన్‌ ఇండిస్టీస్‌ కార్మిక సమావేశంలో 1941 జూలైలో చెప్పారు. రాష్ట్ర, దేశ అభివృద్ధికి పంచవర్ష ప్రణాళికలను సూచించారు. పరిశ్రమలను దేశంలోని వివిధ ప్రాంతాలలో పెట్టడం వలన ఆర్థిక వికేంద్రీకరణ జరిగి జాతీయ ఆదాయం పెరుగుతుందని సూచించారు.

మన దేశ ప్రాథమిక అవసరాలైన కూడు, గూడు, గుడ్డ, రవాణా సౌకర్యాలు మొదలగువాటిని సమకూర్చటానికి ఉన్న వనరులను సమీకరించుకుంటే సరిపోతుందని తెలిపారు. పౌరులు శక్తివంతంగా రూపొందడానికి దశ సూత్ర ప్రణాళికను సూచించారు. అవి (1) స్వయం సహాయతను ఆచరణలోకి తీసుకురావటం (2) విజ్ఞానమే అధికారమని తెలుసుకోవడం (3) సామూహికంగా పని చేయటం (4) ఉత్పాదకశక్తిని, సేవలను పెంచడం (5) భారతదేశ పరిశ్రమలకు చేయూతనివ్వడం (6) దిగుమతులను తగ్గించడం (7) మంచి ప్రమాణాలను పెంచడం (8) సంస్థాగతంగా ఆలోచించి పనులు చేయడం (9) ఏ పనిచేసినా దేశాన్ని దృష్టిలో ఉంచుకొని చేయడం (10) పనిని సామూహికంగా చేయటాన్ని ప్రోత్సహించాలి.

దేశ జనాభాకు అనుగుణంగా ఆహారాన్ని పండించాలని చెప్పారు. 1931లో ఆంధ్రా యూనివర్శిటీ స్నాతకోత్సవంలో కష్టపడి చదవడం ద్వారానే ఉత్తీర్ణులవుతామని, అంతేకానీ విజయ రహస్యాలంటూ ఏమీ ఉండవని అన్నారు. అభివృద్ధి సాధించేందుకు కష్టించి పనిచెయ్యడమే మార్గమని ఉద్బోధించారు. ఏ దేశ అభివృద్ధి అయినా వ్యవసాయం, పారిశ్రామిక పురోగతిపై ఆధారపడి ఉంటుందని విశ్వేశ్వరయ్య నమ్మకం. మూఢాచారాలు, సంఘంలోని వివిధ రకాల దురాచారాలు మొదలైనవాటిపై పోరాడాలని పిలుపునిచ్చారు. కర్మ సిద్ధాంతం, గుడ్డి నమ్మకాల్ని వదిలపెట్టండని ప్రజలకు హితవు చెప్పారు.

విశ్వేశ్వరయ్య సూక్తులు

పని చేయటం దండగయితే నీవు తినటం దండగే నీకు అవసరం లేనిది నీవు కొంటూ ఉంటే నీవు కొనలేనిది నీకు అవసరమనిపిస్తాయి. తుప్పుపట్టి చావడం కంటే తుది వరకు జ్వలించడానికి నేను ఇష్టపడతాను ఉత్తమ జాతిని నిర్మించటానికి మార్గం ఉత్తమ వ్యక్తులను నిర్మించడమే

రైతులకు, ఇంజనీర్లకు సలహాలిస్తూ ఆయన చెప్పిన కథలు ఇలా ఉన్నాయి: ఒక రోజు ఒక పొలంలో ఒక చిన్న విమానం మరమ్మతుకు రావడంతో కిందకు దిగింది. ఆ వైమానికులు దాని విడి భాగాలు కొనుగోలు చేయటానికి పట్టణం వెళ్లారు. ఈలోపు ఆ భూమి రైతు తన కొడుకులను దానికి కాపలా వుంచి విమానం చూడటానికి ఆత్రుతగా వచ్చిన వారందరి దగ్గర కొంత డబ్బును టికెట్టు పెట్టి వసూలు చేశాడు. ఎంత తెలివైన రైతు! మీరు కూడా ఉట్టి కబుర్లతో కాలాన్ని వృథా చేయకుండా బాగా ఆలోచించి పనిచేస్తే ఫలితం దక్కుతుందని వారిని ఉత్సాహపరిచేవారు.

ఒక ఇంజనీర్‌ తప్పు దోవలో డబ్బు సంపాదిస్తే నరకానికి వెళ్తారట. అక్కడ నరకాన్ని తన మేధస్సుతో ఖాళీగా ఉంచకుండా, కాలాన్ని వృథా చేయకుండా బాగా కష్టపడి నరకాన్ని స్వర్గంగా మార్చాడు. అప్పుడు ఆ భగవంతుడు కూడా ఆ ఇంజనీర్‌ను చూసి చాలా సంతోషించాడట.

విశాలమైన దేశానికి ఆర్థిక ప్రగతికి గ్రామమే ఒక ప్రాతిపదిక కావాలి. అన్ని గ్రామాలలో పాఠశాలలు, గ్రంధాలయాలు, ఆహార ధాన్యాగారాలు, రైతాంగానికి కావలసిన అవసరాలు తీర్చే సంస్థలు ఉండాలని అభిలషించారు విశ్వేశ్వరయ్య.ఈనాడున్న బహుళ ఆర్థిక సాధక ప్రయోజన పథకం ఆలోచన అసలు విశ్వేశ్వరయ్యది. ఒక నదిలోని నీటిని బహువిధాలుగా వినియోగించి త్వరితగతిన ప్రగతిని సాధించవచ్చునే ఆలోచనను ఆచరణలో పెట్టడానికి కృషి చేశారు. కావేరి ప్రాజెక్టు ద్వారా విద్యుత్తు ఉత్పాదనకు, వినోదానికి, వ్యవసాయ రంగానికి, పరిశ్రమలకు ఉపయోగపడేలా చేశారు.

విశ్వేశ్వరయ్య ఆలోచనలు నేటికీ ఈ సమాజానికి ఉపయోగకరంగా ఉన్నాయి. కానీ మన విధానాలు దేశ స్వావలంబనను దెబ్బతీసేవిగా ఉంటున్నాయి. క్రమంగా విదేశీ విధానం పరాయితనంగా తయారవుతోంది. దేశ ప్రజల మేలుకన్నా బహుళ జాతి సంస్థలు, కార్పొరేట్‌ సంస్థల అవసరాలు తీర్చడమే పరమావధిగా తయారైంది. దేశహితం, ప్రజల బాగోగులకన్నా ప్రపంచాన్ని శాసించే విదేశీయుల మెప్పే ముఖ్యమైందన్నట్లుగా తయారైంది. అవినీతి జాడ్యం దేశానికి పట్టిపీడిస్తున్నది. నయా ఉదారవాద సంస్కరణల పుణ్యమా అని దేశంలో ఆర్థిక గాలివాటం పెరిగిపోతున్నది. కార్పొరేట్‌ అవినీతి దేశ సంస్థాగత నిర్మాణాన్ని దెబ్బతీస్తున్నది. ప్రకృతి వనరులు ధ్వంసమవుతున్నాయి.

ఆర్థిక వృద్ధి రేటును, సంపన్నుల జాబితాను చూసి మురిసిపోతున్నాం. కానీ పెరుగుతున్న పేదరికాన్ని, పడిపోతున్న ప్రజాజీవన ప్రమాణాలు, ప్రజల నిస్సహాయతను చూడలేక పోతున్నాం. వ్యవసాయాన్ని ప్రజల నుండి వేరుచేసి కార్పొరేట్‌పరం చేస్తున్నాం. సామాన్య జనం ఆహార కొరతను ఎదుర్కొనే పరిస్థితులను కల్పిస్తున్నాం. విద్య, వైద్యం, ఉద్యోగం, ఆరోగ్యం, శ్రమ, పెట్టుబడి, ఉత్పత్తి అన్ని కార్పొరేట్‌పరం చేసి ప్రజలను సంకట స్థితిలోకి నెట్టివేస్తున్నాం. ప్రస్తుత పరిస్థితులు. వీటన్నిటికి మూలం దేశంలో, రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంస్కరణలు, ప్రపంచ బ్యాంకు విధానాలు. వీటిని వదిలించుకొని మనకాళ్లమీద మనం నిలబడే విధానాలు అవలంభించడమే మనముందున్న కర్తవ్యం. ప్రకృతి వనరులను, పర్యావరణాన్ని, భూమి, గాలి, నీరు అన్నిటిని కాపాడి, ప్రజలకు అందుబాటులో ఉంచాలి.

దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక గాలివాటును నియంత్రించి ఉత్పత్తిని, ఉపాధిని పెంపొందించే క్రమబద్ధమైన ఆర్థిక విధానాలు అవలంభించడమే దేశం ముందున్న ప్రధాన కర్తవ్యం. ఏ ఆర్థిక విధానాలైతే ఈ ప్రపంచానికి శ్రీరామరక్ష అని చెప్పబడినవో అవి సంక్షోభంలో కూరుకుపోయినా అవే విధానాలను అవలంభించడం శ్రేయస్కరం కాదు. స్వతంత్రను, స్వావలంబనను, స్వయం శక్తులను పెంపొందించే ఆర్థిక విధానాలను, సామాజిక పొందికను పెంపొందించడం మనముందున్న ప్రత్నామ్నాయం. విశ్వేశ్వరయ్య జీవితం, ఆలోచనలు, ఆచరణలు మనకు నేర్పుతున్న పాఠాలు ఇవే!

1 comment:

  1. విశ్వేశ్వరాయ జీవితం నేర్పే పాఠాలు

    ReplyDelete