Breaking News

వి. ఎస్. రమాదేవి (V.S.Ramadevi)

జననం: జనవరి 15, 1934
మరణం: ఏప్రిల్ 17, 2013

డా. వి. ఎస్. రమాదేవి (జ: 15 జనవరి, 1934) భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనరు మరియు హిమాచల్ ప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల గవర్నరు.

వీరు పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలు లో జనవరి 15, 1934 తేదీన జన్మించారు. వీరి తల్లిదండ్రులు వి.వి. సుబ్బయ్య మరియు వి. వెంకట రత్నమ్మ. ఏలూరు మరియు హైదరాబాదు నగరాలలో ఎమ్.ఎ., ఎల్.ఎల్.ఎమ్. పూర్తిచేశారు. వీరు 1959లో ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు లో న్యాయవాదిగా పనిచేయడం మొదలుపెట్టారు. ఇండియన్ లీగల్ సర్వీసులో నియుక్తులై వివిధ హోదాలలో పనిచేశారు. లెజిస్లేటివ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా, లా కమిషన్ మెంబర్ కార్యదర్శిగా, లెజిస్లేటివ్ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. వీరు కస్టమ్స్ ఎక్సైజు అప్పీళ్ల ట్రిబ్యునల్ సభ్యులుగా పనిచేశారు.

వీరు భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనరు గా నవంబరు 1993 సంవత్సరంలో కొంతకాలం పనిచేశారు. జూలై 1993లో రాజ్య సభ సెక్రటరీ జనరల్ గా నియమితులై 1997 వరకు ఆ పదవిలో ఉన్నారు. 1997లో హిమాచల్ ప్రదేశ్ గవర్నరు గా నియమితులయ్యారు. వీరు ఈ పదవిలో 25 జూలై 1997 నుండి 01 డిసెంబరు 1999 వరకు పనిచేశారు. 1999లో కర్ణాటక గవర్నరుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 21 ఆగస్టు 2002 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఈమె కామన్ వెల్త్ అసోసియేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు అధ్యక్షులుగా ఎన్నికైన తొలి ఆసియా దేశస్తులు.

ఈమె తెలుగు భాషలో ఇరవైకి పైగా గ్రంథాలు, నవలలు, కథానికలు, వ్యాసాలు, నాటకాలు రచించారు. రచయిత్రిగా వీరిని అఖిల భారత రచయిత్రుల సదస్సులో సత్కరించారు. వీరు ఢిల్లీ ఆంధ్ర వనితా మండలి అధ్యక్షులుగా పనిచేశారు.

ఈమె వి. ఎస్. రామావతార్ ను వివాహమాడారు. వీరికి ఒక కుమారుడు మరియు ఇద్దరు కుమార్తెలు.

వీరిని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది.

2013 ఏప్రిల్ 17 న తన 79వ ఏట అనారోగ్యంతో బెంగుళూరు లో మరణించారు.

1 comment:

  1. భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనర్ వి. ఎస్. రమాదేవి.

    ReplyDelete