Breaking News

లాల్ బహాదుర్ శాస్త్రి (Lal Bahadur Shastri)

జననం :2 అక్టోబరు 1904
మరణం : జనవరి 11,1966

లాల్ బహాదుర్ శాస్త్రి, భారత దేశ రెండవ శాశ్వత ప్రధానమంత్రి మరియు దేశ స్వాతంత్ర్యోద్యమములో ప్రముఖ పాత్రధారి. 

బాల్యం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొగల్ సరాయ్ గ్రామంలో లాల్ బహదూర్ 1904 అక్టోబర్ 2న శారదా ప్రసాద్, రామ్‌దులారీ దేవీలకు జన్మించాడు. తండ్రి శారదాప్రసాద్ రాయ్ ఒక నిరుపేద. బతకలేక బడిపంతులు అని అనుకుంటున్న ఆ రోజుల్లో ఆయన బడిపంతులు వృత్తిని చేపట్టి అతికష్టంగా తన కుటుంబాన్ని పోషిస్తూ కాలం గడిపేవాడు. ఇద్దరు ఆడపిల్లల తరువాత జన్మించిన లాల్ బహదూర్ ను చూసుకొని ఆ తల్లిదండ్రులెంతో మురిసిపోయారు.

నిరాడంబరతకు తోడు ఎంతో అభిమానవంతుడైన లాల్ బహదూర్ స్కూలుకు వెళ్ళటానికి ప్రతి రోజు గంగానదిని దాటి వెళ్ళవలసి ఉండేది. నది దాటించే పడవ వాడికి ప్రతి రోజు కొంత పైకం యివ్వాలి. అది స్వల్పమే అయినా లాల్ బహదూర్ దగ్గర అప్పుడప్పుడు ఉండేదికాదు. పడవ మనిషిని అడిగితే ఊరికే నది దాటించగలడు. అయినా అభిమానవంతుడైన లాల్ బహదూర్ అలా ప్రాధేయపడటం ఇష్టంలేక తన బట్టలను విప్పి, వాటిలో పుస్తకాలను చుట్టి మూటలా కట్టి, తన వీపునకు తగిలించుకుని, ప్రాణాలను సైతం తెగించి అవతలి ఒడ్డుకు ఈదుకుని వెళ్ళేవాడు. దురదృష్టవశాత్తు కొడుకు పుట్టిన ఏడాదిన్నరకే లాల్ బహదూర్ తండ్రి మరణించడంతో, ఆ కుటుంబం దిక్కులేని నావలా నిరాధారమైంది. ఆ కుటుంబాన్ని లాల్ బహదూర్ తాత ఆదుకుని వారికి ఆశ్రయం కలిగించాడు.

తాతగారింట భయభక్తులతో పెరిగిన లాల్ బహదూర్ తన పాఠశాలలో ఎంతో నిరాడంబరంగా ఉంటూ ఉపాధ్యాయుల ప్రేమాభిమానాలను చూరగొన్నాడు. తోటి విద్యార్థులు తనకు తండ్రి లేడని గేలిచేస్తూ హేళన చేస్తున్నప్పటికీ ఆ దు:ఖాన్ని దిగమింగి, ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేయక, వారితో పాటు ఆడుతూ, పాడుతుండేవాడు. అది గమనించిన టీచర్లకు లాల్ బహదూర్ పై ప్రేమ ఇంకా ఎక్కువైంది.

తొలి జీవితము మరియు స్వాతంత్ర్యోద్యమము
శాస్త్రీజీ, యునైటెడ్ ప్రావిన్స్ (ప్రస్తుత ఉత్తర ప్రదేశ్) లోని మొఘల్‌ సరాయిలో జన్మించాడు. 1921లో మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమములో పాల్గొనుటకై కాశీలోని జాతీయవాద కాశీ విద్యాపీఠములో చదవడము ప్రారంభించాడు. అక్కడ విద్యాభ్యాసము అనంతరము 1926లో శాస్త్రి అనే పట్టభద్రుడయ్యాడు. స్వాంతంత్ర్యోద్యమ పోరాట కాలములో మొత్తము తొమ్మిది సంవత్సరాలు జైలులోనే గడిపాడు. సత్యాగ్రహ ఉద్యమము తర్వాత 1940 నుండి 1946 వరకు ఈయన జైళ్లోనే ఉన్నాడు.

రాజకీయ జీవితము
స్వాతంత్ర్యము తర్వాత, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ మంత్రివర్గములో గృహ మంత్రిగా పనిచేశాడు. 1951లో లోక్ సభ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు. ఆ తరువాత కేంద్ర రైల్వే శాఖా మంత్రిగా పనిచేశాడు. తమిళనాడులోని అరియళూరు వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశాడు. సాధారణ ఎన్నికల తర్వాత తిరిగి కేంద్ర మంత్రివర్గములో చేరి తొలుత రవాణా శాఖ మంత్రిగా తర్వాత 1961 నుండి గృహ మంత్రిగా పనిచేశాడు.

ప్రధాన మంత్రిగా
1964లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మరణం తరువాత అతని స్థానాన్ని పూరించడానికై, లాల్ బహదూర్ శాస్త్రీ మరియు మొరార్జీదేశాయ్ సిద్దంగా ఉండగా, అప్పటి కాంగ్రేసు పార్టీ ప్రెసిడెంటు కామరాజ్ సోషలిస్టు భావాలున్న లాల్ బహదూర్ శాస్త్రీకి మద్దతుపలికి ప్రధానమంత్రిని చేయడంలో సఫలీకృతుడయ్యాడు. లాల్ బహాదుర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యేనాటికి దేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. ఈ సంక్షోభమును తాత్కాలికంగా పరిష్కరించడానికై విదేశాల నుండి ఆహారాన్ని దిగుమతి చేసాడు. తరువాత దీర్ఘకాలిక పరిష్కారానికై దేశంలో వ్యవసాయ విప్లవానికై (గ్రీన్ రెవల్యూషన్) బాటలుపరిచాడు.

1965 ఆగష్టులో, పాకిస్తాన్ తన సేనలను ప్రయోగించి జమ్మూ కాశ్మీరులోని కచ్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది, తద్వారా జమ్మూకాష్మీరులోని ప్రజలు ఉద్యమించి, భారతదేశం నుండి విడిపోతారని ఆశించింది. కానీ అటువంటి ఉద్యమం పుట్టలేదు. పాకిస్తాన్ ఆక్రమణ గురించి తెలుసుకున్న లాల్ బహదూర్ శాస్త్రి వెంటనే త్రివిధ దళాలకు నియంత్రణ రేఖను దాటి లాహోరును ఆక్రమించుకోవడానికి ఆదేశాలు ఇచ్చాడు.

పురస్కారాలు
భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న పురస్కారాన్ని, భారతదేశ ప్రభుత్వం వీరి మరణానంతరం 1966లో ప్రకటించింది.

1 comment:

  1. పూర్వ భారత ప్రధానమంత్రి, లాల్ బహదూర్ శాస్త్రి .

    ReplyDelete