Breaking News

కార్యకర్త

కార్యకర్త
' సంఘటనకు మూలమైన సంఘశాఖ మనదిరా
గంగానదిలా సాగే కార్యశక్తి మనదిరా lసంఘటనl
అణువు చిన్నదే దానికి అమితశక్తి ఉందిరా
విత్తు చిన్నదే కాని దానికి సత్తువెంతో ఉందిరా
శాఖ చిన్నదే శాఖా కార్యక్రమం చిన్నదే
శాఖలోనె సంఘటనాశక్తి ఇమిడి ఉందిరా lసంఘl '

ఇలా సాగే ఒక గీత్ సంఘంలో పాడుకుంటుంటాం. సంఘటనాశక్తిని పెంపొందించే శాఖ ఒక శక్తిపీఠం. అలాంటి శక్తిపీఠాన్ని కాంతులు వెదజల్లేలా చేసేవాడు ముఖ్యశిక్షక్. ఒక నిర్ణీత స్థలంలో, రోజూ నిర్ణీత సమయంలో గంటసేపు జరిగేదే శాఖ. ఉదయం జరిగే శాఖను ప్రభాత్ శాఖ అని, సాయంత్రం జరిగే శాఖను సాయంశాఖ అని, రాత్రి వేళల్లో జరిగే శాఖను రాత్రి శాఖ అని పిలవడం పరిపాటి. (ముంబై మహానగరంలో రాత్రి 12.30 నుండి 1.30 గంటల వరకూ శాఖలు జరుగుతాయట. ఆ శాఖలకు హోటళ్ళలో, బార్లలో , ఫ్యాక్టరీలలో పనిచేసే ఉద్యోగులు వస్తారని , ఆ శాఖల పని చూడటానికి ప్రత్యేకంగా ప్రచారకులు ఉంటారని ఒకప్పటి సహ సర్ కార్యవాహ శ్రీ సురేష్ రావు కేతకర్ చెప్పగా విన్నాను) అయితే ఒకే నిర్ణీత స్థలంలో సాయంత్రం వేళ రెండు వేర్వేరు సమయాల్లో శాఖ జరిగితే నిర్దిష్టంగా ఏమనాలో దానికి సంఘంలో ప్రత్యేక పదబంధం ఏదీ లేదు.
అలా ఒక నిర్ణీత స్థలంలో సాయంత్రం వేళ రెండు నిర్ణీత సమయాల్లో జరిగిన రెండు శాఖల ముచ్చట మీకొరకు :
అనంతపురం నగరంలో అలాంటి శాఖలు ఓ ముప్పయ్యేళ్ళ క్రితం జరిగాయి. రైల్వేస్టేషన్ కు దగ్గరలో బహుశా రెండవరోడ్డులో ఒక పాఠశాల మైదానం. సాయంత్రం 4.30నుండి 5.30 గంటల వరకూ శాఖ జరిగేది. శాఖలో అందరూ బాల స్వయంసేవకులే. దాదాపు 20 - 30 సంఖ్య ఉంటుండేది. ప్రార్థన అనంతరం ఆ బాల స్వయంసేవకులు వెళ్ళిపోయేవారు. మామూలుగానైతే వాళ్ళతోబాటు శాఖా ముఖ్యశిక్షక్ కూడా వెళ్ళిపోవాలి. కానీ అక్కడే ఉంది ట్విస్ట్. ఆ శాఖా ముఖ్యశిక్షక్ అక్కడే ఉండిపోయేవాడు. 5.45 గంటల సమయమయ్యేటప్పటికి మళ్ళీ 20 -30 మంది దాకా బాల స్వయంసేవకులుసంఘస్థాన్ కు చేరుకునేవారు. 6.45 గంటల వరకూ శాఖ నడిచేది. శారీరక్, బౌద్ధిక్ కార్యక్రమాలన్నీ తు.చ.తప్పక జరిగేవి. కార్యక్రమాలన్నీ ఎంతో ఆకర్షణీయంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా జరిగేవి. రెండు శాఖలకు వేర్వేరుగా వచ్చే బాల స్వయంసేవకులు తమకు వీలైన శాఖలో పాల్గొనడానికి వీలుండేది కాదు. ఏ శాఖ స్వయంసేవకులు ఆ శాఖకే ఫిక్స్.రెండు శాఖల శారీరక, బౌద్ధిక కార్యక్రమాల యోజన కూడా విడిగా ఉండేదేమో! ఒకే సంఘస్థాన్ లో రోజూ రెండు సాయంశాఖలు జరగడం చాలా విశేషం. చాలాసార్లు పర్యటనకు వచ్చిన అధికారులు రెండు శాఖలలో పాల్గొని మార్గదర్శనం చేయాల్సి రావడం జరిగేది. 
ఆ రెండు శాఖలకు ముఖ్యశిక్షక్ గా శ్రీ పి.సతీష్ వ్యవహరించేవాడు. అలా రెండు శాఖలూ ఏళ్ళ తరబడి అవిచ్ఛిన్నంగా నడవడంలో శ్రీ సతీష్ పాత్ర అవిస్మరణీయమైనది. అనంతపురం విభాగ్ కేంద్రం( ఆ రోజుల్లో కడప, అనంతపురం, కర్నూలు రాజకీయ జిల్లాలతో కూడినది )లో అలా జరిగే శాఖలు కార్యకర్తలకు, ప్రచారకులకు, సంఘ అధికారులకు ప్రేరణగా నిలిచేవి.

1 comment:


  1. ' సంఘటనకు మూలమైన సంఘశాఖ మనదిరా
    గంగానదిలా సాగే కార్యశక్తి మనదిరా lసంఘటనl
    అణువు చిన్నదే దానికి అమితశక్తి ఉందిరా
    విత్తు చిన్నదే కాని దానికి సత్తువెంతో ఉందిరా
    శాఖ చిన్నదే శాఖా కార్యక్రమం చిన్నదే
    శాఖలోనె సంఘటనాశక్తి ఇమిడి ఉందిరా lసంఘl '

    ReplyDelete