Breaking News

అవి అమృత హస్తాలు


ఈ లోకంలో పరమ భయంకరమైనవి రెండే – ఒకటి ఆకలి. రెండు భయం. బిడ్డ ఆకలి తెలిసేదీ అమ్మకే, బిడ్డ భయం తెలిసేదీ అమ్మకే. ఈ లోకంలో పరమ దురదృష్టవంతుడెవడు అంటే అమ్మలేనివాడే అని చెప్పక తప్పదు. దేనికి భయం కలుగుతుందో తెలియదు. అలా ఆడుకుంటూ ఉంటాడు. ఉన్నట్లుండి కెవ్వుమని అరుస్తాడు. అమ్మ గబగబా వచ్చి తన గుండెలమీద వేసుకుని జోకొట్టగానే వాడికి ఎక్కడలేని ఉపశాంతి కలుగుతుంది.

నిర్ణీత సమయంకంటే ముందేపుట్టిన పిల్లలను తీసుకెళ్ళి–అమ్మ గర్భంలో ఉండే వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించే ‘ఇన్క్యుబేటర్‌’ అనే పరికరంలో ఉంచుతారనే విషయం తెలిసిందే కదా! అక్కడ పడుకోబెట్టినా కూడా రోజుమొత్తంలో తల్లివెళ్ళి ఆ బిడ్డను ఒకసారి ముట్టుకోవాలి. బిడ్డకు ఆమె స్పర్శ తగిలేసరికి చాలా శాంతి పొందుతాడట. అసలు పసివాడిగా ఉన్నప్పుడు వాడిని ముట్టుకున్నవాళ్ళెవరో, వాడికి శాంతి కల్పించినవాళ్ళెవరో వారి స్పర్శ ఆ పిల్లవాడి జీవితాంతం జ్ఞాపకం ఉంటుంది. ఉత్తరోత్తరా వాడి శాంతి వాళ్ళమీదే ఆధారపడుతుంది. బ్రహ్మ సృష్టి ఉపకరణాల్లో నాలుగవది అయిన భోగం అంటే సంతోషాన్ని పొందడమంటే ఇదే.
సుఖం, సంతోషం అమ్మతనంలోనే ఉంటాయి.
ఆదిశంకరాచార్యుల వారు తను రాసిన ఒక గ్రంథాన్ని ‘శివానందలహరి’ అన్నారు. మరొకటి అమ్మవారి మీద రాసినప్పుడు దానిని ‘శ్రీమాతానందలహరి’ అనో, శ్రీమాతాలహరి’ అనో అనాలి. కానీ ఆయన ‘సౌందర్య లహరి’ అన్నారు. ఎందుచేత అంటే – సౌందర్యమంటే అమ్మయే. మనసుకు ఆనందం, ఉద్వేగం కల్పించడం, ఏదో ఒక సంతోషాన్ని అందించడం కాదు. అన్నివేళలా మనసులో అల్లుకున్న సంతోషాలన్నీ క్షేమకరం కావు. అలాగే లోకంలో నా భార్యకన్నా పక్కింటివాడి భార్య అందంగా ఉంటుందనడం ధూర్తతనం. ఆ మాట ఏ పురుషుడి నోటివెంటా రాకూడదు. పొరబాటున కూడా ఆ మాటను అనగలిగిన ధూర్తుడుంటాడేమో కానీ ‘‘మా అమ్మకన్నా వాళ్ళ అమ్మ అందంగా ఉంటుంది’’ అని ఎవరూ అనరు. ఎవరి అమ్మ వాళ్ళకు అందం.
అమ్మకు ఎంత ఐశ్వర్యం ఉన్నది, ఎంత చదువు ఉన్నదీ అన్నదానితో సంబంధం ఉండదు. రహదారి నిర్మాణంలో ఒళ్ళంతా చెమటపట్టి కూలిపని చేసుకునే తల్లికి సమీపంలోనే ఆడుకుంటున్న ఒక పిల్లను దారినపోతున్న ఆగర్భశ్రీమంతురాలయిన ఒక స్త్రీ ఎత్తుకుని నోట్లో పంచదార పోసే ప్రయత్నం చేస్తే... ఇంత డబ్బున్న ఆమె, ఇన్ని నగలు వేసుకున్నామె, ఈమె పెట్టిన పంచదార తిందాం, ఈమె ముందు మా ఆమ్మ ఏ పాటి’’ అని ఆ పిల్ల అనుకోదు. బలవంతంగా విడిపించుకుని వెళ్ళి చెమటతో, దుమ్ముతో తడిసిముద్దయిన తన తల్లి ఒళ్లో వాలిపోతుంది. అమ్మే క్షేమం. అమ్మే సంతోషం. బిడ్డకు ఎంత వయసొచ్చినా అమ్మలో అందం అంటే క్షేమమే.
అమ్మకున్న మరో గొప్పతనం ఎక్కడుంటుందంటే తన కడుపున పుట్టినపిల్లల్లో అందరికన్నా పనికిమాలిన వాడెవడో వాడిని ఎక్కువ ప్రేమిస్తుంది, ఎక్కువ స్మరిస్తుంది. లోకంలో మిగిలిన వాళ్ళు సమర్థత ఉన్న పిల్లలను ఎక్కువగా ఇష్టపడతారు. అమ్మ తన సంతానంలో అర్భకుడు, చేతకానివాడైన బిడ్డ వృద్ధిలోకి రావాలని తహతహలాడుతుంది. అటువంటి అమ్మ వెళ్ళిపోయిన తరువాత ఇక అలా ప్రేమించే వాళ్ళుంటారని చెప్పడం కష్టం. అమ్మ కన్నీళ్ళతో వాడి క్షేమం కోరి ఈశ్వరుడిని ప్రార్థిస్తుంది. అటువంటి వ్యక్తి సృష్టిలో ఉండరు. భగవంతుని దయ ఎటువంటిదో అమ్మదయ అటువంటిది. అసలు క్రౌర్యమనే మాటకు ఆమె తత్త్వం అన్వయం కాదు.
అమ్మకు 90 సంవత్సరాలొచ్చినా, శరీరమంతా ముడతలు పడిపోయి, ఇలా పట్టుకుని లాగితే చిరిగిపోతుందేమోనన్నంతగా పొట్లపండులాగా అయిపోయినా, కళ్ళజోడులోంచి కూడా ఎదుట ఉన్న బిడ్డ కనబడనంత చత్వారం వచ్చి మంచాన పడి ఉన్నా... రాత్రి ఆలస్యంగా భోజనం చేయడానికి వచ్చిన కొడుకు అన్నం తిన్న సమయాన్ని (తక్కువ) బట్టి, పక్కగదిలోంచి ‘‘ఏరా కడుపునిండా అన్నం తిన్లేదూ..!!! ఇలా తింటే నీ ఆరోగ్యం ఏమవుతుంది!’’ అని మందలింపుగా అంటుంది. అంత అవసానదశలో కూడా తన క్షేమాన్ని పక్కనబెట్టి పరుల క్షేమాన్ని కోరేది నిస్సందేహంగా తల్లే.
అందుకే ఆమె బ్రహ్మ ఉపకరణాలకు అన్నింటికీ కేంద్ర బిందువు. ఆమెలో బ్రహ్మ అంశే లేకపోతే సృష్టి జరిగే అవకాశం లేనే లేదు. ఎంత నెత్తురు పోతుందో... ఎన్ని నొప్పులు భరిస్తుందో, ఒక్కొక్కసారి లోపలికి వెడితే అదే చివరి సారవుతుంది. తిరిగొస్తానన్న నమ్మకం లేకపోయినా... తల్లి కాకుండా ఉండడాన్ని ఇష్టపడదు. అంతేకాదు, ఒక్కసారన్నా ‘‘అమ్మా !’’ అని పిలిపించుకుని శరీరాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతుంది. అమ్మలాంటి వ్యక్తి లోకంలో మరొకరుండరు. అందుకే అమ్మ బ్రహ్మ. అందుకే ఆమెకు ప్రథమ నమస్కారం చేయాలని వేదం చెప్పింది.  
-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు.

1 comment: