Breaking News

కలియుగ భీముడు కోడి రామ్మూర్తి నాయుడు (Kodi Rammurthy Naidu)

జననం: 1882 
మరణం : 1942


కోడి రామ్మూర్తి నాయుడు (1882 - 1942) ఆంధ్రరాష్ట్రానికి చెందిన ప్రముఖ వస్తాదు మరియు మల్లయోధులు. ఇరవయ్యో శతాబ్దపు తొలి దశకాల్లో ప్రపంచ ఖ్యాతి గాంచిన తెలుగువారిలో అగ్రగణ్యులు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించారు. కోడి వెంకన్న నాయుడు వీరి తండ్రి. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, తండ్రి ప్రేరణతో విజయనగరంలో తన పినతండ్రి కోడి నారాయణస్వామి దగ్గర పెరిగారు. అక్కడ ఒక వ్యాయమశాలలో చేరి దేహ ధారుడ్యాన్ని పెంచుకోవడంతో పాటు కుస్తీ కూడా నేర్చుకున్నారు. 21 సంవత్సరాల వయసులోనే ఇతడు రొమ్ముపై 1 1/2 టన్నుల భారాన్ని మోసేవాడు. తరువాత 3 టన్నుల భారాన్ని కూడా మోయగలిగాడు. మద్రాసులో సైదాపేట కాలేజిలో ఒక సంవత్సరం వ్యాయామశాలలో శిక్షణ తీసుకుని విజయనగరానికి తిరిగి వచ్చి విజయనగరం ప్రొవిన్షియల్ లోయర్ సెకండరీ పాఠశాలలో వ్యాయమ శిక్షణోపాధ్యాయునిగా పని చేశారు. తరువాత ఒక సర్కస్ సంస్థను స్థాపించి తన బలప్రదర్శనతో దేశ విదేశాలలో ప్రేక్షకులను అబ్బురపరిచారు.మన పురాణాలలో బల శబ్దానికి భీముడు, ఆంజనేయుడు పర్యాయ శబ్దాలైనట్లు ఆంధ్ర ప్రదేశంలో ఇతడి పేరు బలానికి పర్యాయపదంగా పరిగణించబడింది. తన చివరి రోజుల్లో రామ్మూర్తి నాయుడు బలంఘీర్ పాట్నాలో కల్వండే పరగణా ప్రభువు పోషణలో జీవితం గడుపుతూ మరణించారు.

బలప్రదర్శన విశేషాలు
గట్టిగా ఊపిరి పీల్చుకుని కండలు బిగించి, తన ఛాతీకి చుట్టిన ఉక్కు తాళ్ళను తెంచేవారు.

ఛాతీ మీదకు ఏనుగును ఎక్కించుకుని ఐదు నిముషాల పాటు నిలిపేవారు.

రెండు కార్లను వాటికి కట్టిన తాళ్ళు రెండు చేతులుతో పట్టుకుని కదలకుండా ఆపేవారు.

ఒంటి చేత్తో రైల్ ఇంజను ఆపిన ఘనుడు.

బిరుదులు
ఆనాటి ఇంగ్లండు పాలకులైన కింగ్ జార్జ్, క్వీన్ మేరీలు రామ్మూర్తి నాయుడి బల ప్రదర్శనకు అబ్బురపడి, 'ఇండియన్ హెర్క్యులెస్' అనే బిరుదును ప్రసాదించారు. ఇంకా కలియుగ భీమ, మల్ల మార్తాండ, జయవీర హనుమాన్, వీరకంఠీరవ వంటి బిరుదులను కూడా సొంతం చేసుకున్నరు.

1 comment:

  1. ప్రముఖ మల్ల వీరుడు, కలియుగ భీముడు బిరుదు పొందిన కోడి రామమూర్తి.

    ReplyDelete