Breaking News

పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు - 17 / 50


1960 నవంబర్ 24 న మంగళూరులో ఉండగా శ్రీ గురూజీ ని కలవడానికి, పక్కనే ఉన్న కాసరగోడు తాలూకాలోని ఉప్పళ అనే ఊరినుండి ఒక యువకుల బృందం వచ్చింది. ఆ ఊర్లో భజనమండలి ఉంది. సంవత్సరానికి ఒకసారి ఊరిమధ్యలో ఉన్న దేవాలయం నుండి ఊరి మరో చివరన ఉన్న దేవాలయానికి ఊరేగింపుగా భజన చేస్తూ వెళ్ళి పూజ, ప్రసాద వితరణతో కార్యక్రమం జరిగేది. ఇందులో ఊరిలోని హిందువులు పాల్గొనేవారు. అయితే ఊరేగింపు సాగే దారిలో ఒక మసీదు ముందు భజన ఆపి, మౌనంగా వెళ్ళే పద్ధతి ఆచరణలో ఉండింది. దాన్ని ఇకపై ఆపేయాలని భజనమండలి లోని కొందరు యువకులకు అన్పించింది. కానీ బానిస మనస్తత్వం నిండిపోయిన కొందరు హిందువులు దానికి ఒప్పుకోవడంలేదు. 1960-61 లో జరిగే ఊరేగింపులో ఏదేమైనా సరే భజన ఆపకుండా వెళ్ళాలని యువకులు నిర్ణయించుకున్నారు. దాంతో ఊర్లోని హిందూ సమాజంలో పర- వ్యతిరేక ప్రతిక్రియ ను కల్గించింది. 


శ్రీ గురూజీ వద్దకొచ్చిన బృందం మసీదు ముందర భజన ఆపకుండా వెళ్ళాలని భావించేవారిది. వారి కోరిక ఏమిటంటే , మంగళూరు చుట్టుపక్కల ఊర్ల నుండి స్వయంసేవకులు, ఇతర హిందువులు ఎక్కువ సంఖ్యలో వచ్చి ఊరేగింపులో పాల్గొనేలా చేయాలనేది. ఒకసారి హిందూశక్తి ప్రదర్శన చేస్తే, ముస్లింల బెదిరింపుకు తాము భయపడేది లేదని ఎత్తిచూపితే , రాబోయే ఏళ్ళలో తామే దాన్ని కొనసాగించుకు పోతామనే ఆలోచన వారిది. ఇదే విషయం శ్రీ గురూజీకి చెప్పారు. 
అది విన్న శ్రీ గురూజీ ' మీ యోజన ప్రకారం ఊరేగింపు జరిగేటపుడు అకస్మాత్తుగా ముస్లింలు దాడిచేస్తే మీ ఊరిలోని ఇతర హిందువులు ఏం చేస్తారు? ' అని ప్రశ్నించారు. అందుకా యువకులు ' వారేమీ చేయరు. వారికున్న భయమే అది. అకస్మాత్తుగా దాడి జరిగితే , మేం ముందే చెప్పలేదా? అంటారు. ఇప్పటికే మానిర్ణయంతో వారికి భయం పుట్టింది. ఆ రోజు వాళ్ళు తమ ఇళ్ళలోనే ఉంటారు. వాళ్ళ ద్వారా మాకు ఎలాంటి సహకారమూ లభించదు ' అన్నారు. అపుడు శ్రీ గురూజీ ' కార్యక్రమం మీ ఊరిది. ఇప్పటిదాకా ఒక తప్పుడు పద్ధతిని ఆచరిస్తూ వచ్చింది మీ ఊరివారు. ఇక ఇపుడు దాన్ని సరిచేయడానికి రావలసింది వేరే ఊరి వాళ్ళా? బయటివాళ్ళొచ్చి దెబ్బలు తిని మీ ఊరి అవమానాన్ని నివారించాలా? అలాంటిది జరగదు. ఊర్లోని కళంకాన్ని దూరం చేయాలని మీ కోరిక అయితే మీ ఊర్లోని హిందువులంతా ముందుకు వచ్చేలా ధైర్యం నింపండి. మీకోసం ఇంకెవరో దెబ్బలు తినడం మీకు అవమానం అన్పించడం లేదా? అందుకోసం ఎవరూ బయటినుండి రారు. ఊర్లో కొత్త అధ్యాయం మొదలుపెట్టడం కోసం తమవారే దెబ్బలు తినడానికి సిద్ధపడటాన్ని చూస్తేనన్నా , మీ ఊరివారిలో మార్పు వస్తుందంటూ, ' This unworthy Hindu society deserves to be beaten' (ఈ అయోగ్య హిందూ సమాజం దెబ్బలు తినడానికే యోగ్యం) అన్నారు. దాంతో ఆ బృందం ఏమీ చెప్పలేక వెళ్ళిపోయింది. 
ఇదంతా జరిగింది జిల్లా కార్యకర్తలు బైఠక్ కొరకు కలిసినపుడు. ఆతర్వాత బైఠక్ మొదలైంది. శ్రీ గురూజీ చివరి మాట విని అందరికీ ఆశ్చర్యం. బైఠక్ అయ్యాక కాసరగోడు తాలూకా కార్యకర్తలతో ఉప్పళ గ్రామంలో జరిగే కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వారితో ' అనేక సంవత్సరాల తర్వాత హిందూ సమాజంలోని కొందరు యువకుల్లోనైనా , తమకు జరుగుతున్న అవమానాన్ని తొలగించుకోవాలనే చైతన్యం రావడం ఒక శుభ సంకేతం. అది వ్యర్థం కారాదు. వారి సంకల్పం, ఉత్సాహాలకు మరింత పుష్ఠినిచ్చే పాత్ర మనది కావాలి. అందుకోసం ఊర్లోని హిందువులను కలిసి ఎక్కువ సంఖ్యలో ఊరేగింపులో పాల్గొనేలా చేయాలి. ఊరి గౌరవాన్ని పెంచే ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని తమ అభిమానాన్ని పెంచుకోవడం కోసం బయటి ఊర్లనుండి కూడా పెద్ద సంఖ్యలో హిందువులు వస్తున్నారని వారికి తెలపండి. ఎక్కువ మంది ఊరేగింపులో పాల్గొనేలా చేసి ఊరివారి మనోబలం పెంచండి. ఈసారి హిందువులు అన్నింటికీ తయారై అధిక సంఖ్యలో ఊరేగింపులో పాల్గొంటున్నారనే సంకేతం, దాన్ని విరోధించేవారికీ చేరాలి. ఆ ప్రాంత చరిత్రలో అదొక శుభోదయ సందర్భం కావాలి' అన్నారు. 
ఆయన చెప్పినట్లే అది కాసరగోడు తాలూకాలో ఒక బానిసత్వ పరంపరను పూర్తిగా తొలగించిన కార్యక్రమమైంది.
- బ్రహ్మానంద రెడ్డి.

1 comment:

  1. ఆయన చెప్పినట్లే అది కాసరగోడు తాలూకాలో ఒక బానిసత్వ పరంపరను పూర్తిగా తొలగించిన కార్యక్రమమైంది.

    ReplyDelete