Breaking News

పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు - 16 / 50


1963 లో శ్రీ గురూజీ పర్యటన సందర్భంగా మంగళూరులో పథసంచలనం జరిగింది. ఆ తర్వాత బైఠక్. బైఠక్ లో ఒక కార్యకర్త తన వంతు రాగానే లేచి తన పరిచయం చేశాడు. ఒక క్షణకాలం అతడిని తదేకదృష్టితో చూసిన శ్రీ గురూజీ ' నువ్వు సాయంత్రం పథసంచలనంలో ఘోష్ బృందంలో ఉన్నావు కదా? ' అనడిగారు. ఔనన్న అతడితో ' నువ్వు వాయిస్తున్న వాయిద్యం ఏదని మళ్ళీ అడిగారు. అతడు ' ట్రయాంగల్ ' అన్నాడు. ( అప్పటికింకా వాయిద్యాలకు భారతీయ పేర్లు అంతగా వాడుకలోకి రాలేదు) తక్షణమే శ్రీ గురూజీ ' How could it be a Triangle? Was it not just an angle? ' ( అది త్రికోణం అవడం ఎలా సాధ్యం? అది ఒక కోణం మాత్రమేగదా? ) అని ఆ కార్యకర్తను అడిగారు. అతడు నవ్వుతూ ' అవును' అన్నాడు.

జరిగిందేమిటంటే పథసంచలనం బయల్దేరేటపుడు చేతిలో ట్రయాంగిల్ కు ఒక చివరన కాసింత పగులు ఉండింది. పదేపదే దానిమీద కొట్టడంవల్ల అది విస్తరించి ఒక ముక్క విరిగిపోయింది. విరిగిపోయిన ముక్కను అతడు వెంటనే తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. మిగిలిన భాగంతోనే పథసంచలనంలో పాల్గొన్నాడు.ఘోష్ బృందంలో తనకు దగ్గరగా ఉన్నవారిని వదలి ఎవరూ గుర్తించలేదు అనుకున్నాడు. అయితే శ్రీ గురూజీ ,ఆ కార్యకర్త రెండే బాహువులున్న ట్రయాంగల్ ని వాయించడం గమనించారు. 

ఈ సంఘటనలో విశేషమేమిటంటే, సంచలనంలో ఉన్న వందలాది స్వయంసేవకుల మధ్య ఒకడైన అతడు, శ్రీ గురూజీకి కన్పించింది ఒకట్రెండు సెకండ్ల కాలం అయిఉంటుంది. అంత తక్కువ సమయంలో అనేక వాయిద్యాలను వాయిస్తున్న వాదకుల మధ్య ఒకడైన అతడిని గుర్తించడం, అతడు ఏ వాయిద్యం వాయిస్తున్నాడో గమనించడమేగాక , అతడిని జ్ఞాపకముంచుకుని, బైఠక్ లో అతడిని గుర్తించడం కూడా విశేషమే. ఆయన అతి సూక్ష్మ పరిశీలనా సామర్థ్యానికి ఇదొక అద్భుత ఉదాహరణ.
- బ్రహ్మానంద రెడ్డి.

1 comment:

  1. 1963 లో శ్రీ గురూజీ పర్యటన సందర్భంగా మంగళూరులో పథసంచలనం జరిగింది. ఆ తర్వాత బైఠక్. బైఠక్ లో ఒక కార్యకర్త తన వంతు రాగానే లేచి తన పరిచయం చేశాడు.

    ReplyDelete